రాజమహేంద్రవరం: వైద్య సేవల్లో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు రావడం గర్వకారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ను శనివారం ప్రారంభించారు.
కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా ఈ బ్లాక్ను ప్రారంభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో 650 పడకలు ఉన్నాయని, కొత్తగా 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడంతో వైద్య సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరాన్ని బట్టి మరో 25 నుంచి 30 పడకలు పెంచుకునే అవకాశం ఉందన్నారు.
ఆసుపత్రిలో బెడ్ల కొరత, ఒకే బెడ్పై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్న పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రజలు చెప్పే సమస్యలను విని వదిలేయకుండా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనడానికి క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రజల సూచనల మేరకు ఎక్స్రే తదితర సేవల్లో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించామని తెలిపారు.
పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, కొత్త క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఆ సమయంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ బాగున్నాయని చెప్పి వెళ్లే వ్యక్తిని తాను కాదని, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పెద్ద వ్యవస్థలో రాత్రికి రాత్రే మార్పులు సాధ్యం కావని, అయితే లోపాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు నిరంతరం ప్రయత్నించడమే నాయకుడి చిత్తశుద్ధి అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సేవలు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తామని స్పష్టం చేశారు.
క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రి జె.పి. నడ్డా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్కు నగర ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news