దళితులు, క్రైస్తవుల రక్షణ, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. దళిత, క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
శనివారం నంద్యాల ఎస్పీజీ మైదానంలోని రైడర్ మెమోరియల్ హాల్లో నిర్వహించిన దళిత, క్రైస్తవుల రాష్ట్ర గర్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు రాజ్యాంగం ద్వారా దళితులకు హక్కులు, రక్షణ కల్పించారని గుర్తుచేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దళితుల అభ్యున్నతికి కృషి చేసి పక్కా గృహాలు, సాగుభూములు అందించారని, ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దళిత, క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.
నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో దళితులు, క్రైస్తవులు తన విజయానికి అండగా నిలిచారని, వారి మద్దతు ఎప్పటికీ మరవలేనిదని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని కోరారు.
ఈ సందర్భంగా బైరెడ్డి కుటుంబం సమానత్వానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓ భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు. తన తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఓ అనాథ దళిత బాలికను దత్తత తీసుకుని ఉన్నత విద్య అందించి, జీవితంలో స్థిరపడేలా చేశారని చెప్పారు. అదే తమ కుటుంబ విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, ఎనుముల రాజకుమార్, వేల్పుల విజయ్ కుమార్, కేడెం విశ్వనాథం తదితరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news