ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో నౌకపై జరిగిన క్షిపణి దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా మారింది. భారతీయ నావికుల భద్రత, సంక్షేమం, రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత నౌకాదళం, విదేశాల్లోని భారత మిషన్లు, మిత్ర దేశాల సముద్ర సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు, నావికుల సంక్షేమ సంస్థలతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ వెల్లడించింది. సంఘర్షణ ప్రభావిత సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న భారతీయ నావికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సూచించింది.
జూన్ 10న ఒమన్లోని సోహార్ సమీపంలో ప్రయాణిస్తున్న పలావు జెండా కలిగిన ఎంటీ సెట్టెబెల్లో నౌక క్షిపణి దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు సహా 28 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన వారిని గుర్తించి వారి మృతదేహాలను ధృవీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రక్షించబడిన నావికులను స్వదేశానికి తీసుకురావడం, మృతుల పార్థివ దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం కోసం చర్యలు వేగవంతం చేశారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ప్రతి భారతీయ నావికుడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషాద ఘటనలో మరణించిన నావికుల కుటుంబాలకు సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారతీయ నావికుల సంక్షేమం, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణ, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభావిత కుటుంబాలతో అధికారులు నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news