ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై సమగ్రంగా చర్చ జరిగింది.
నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని వివరించారు. డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ట్యాంకర్లు రిటైల్ బంకులకు చేరుకుంటున్నాయని తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఉన్నతాధికారులు డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితిని ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలని సూచించారు.
బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఆయన సూచించారు.
మొత్తం మీద పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను వేగంగా పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news